ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి
మేడ్చల్, (ప్రజా స్వరం):
బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ఓ వెంచర్ కు హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు వెంచర్ చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలు కూల్చకుండా ఉండటానికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి సంబంధిత వెంచర్ నిర్వాహకుల వద్ద నుంచి రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్రహరీ గోడలు, మెయిన్ గేట్ కూల్చివేస్తానని తెలపడంతో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డికి వెంచర్ నిర్వాహకులు ముందస్తుగా రూ. లక్ష ఇవ్వగా మిగిలిన రూ. నాలుగు లక్షల విషయంలో వెంచర్ నిర్వాహకులు గురువారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో శనివారం ఉదయం కొంపల్లిలోని రాధాకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న రాయచందిని మహల్ వద్ద రూ.3 లక్షల 50 వేల నగదును కారులో వచ్చిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాధాకృష్ణ రెడ్డి ఎడమ చేతికి ఫినోప్తిలిన్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కాగా సదరు అధికారిని ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయానికి తీసుకొచ్చి విచారించిన అనంతరం లంచం తీసుకున్న అధికారి కారు సీజ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే కాల్ చేయండి :
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను లంచం డిమాండ్ చేసినా, వేధించినా వెంటనే డయల్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయంలో లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అనే పోస్టర్ను కార్యాలయ భవనానికి అతికించారు.


