లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఎస్ఐ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఎస్ఐ
పటాన్ చెరు, జనవరి 2(ప్రజా స్వరం)
సంగారెడ్డి జిల్లాలో అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.
ఫిర్యాదుదారుడి పేరును క్రైం నంబర్ 508/2025 నుంచి తొలగించేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పిన ఎస్ఐ రమేష్, ఇందుకు మొత్తం ₹30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో భాగంగా ఇప్పటికే 2025 డిసెంబర్ 17న ₹5,000 లంచంగా స్వీకరించినట్లు విచారణలో తేలింది.
మిగిలిన ₹20,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ముందుగా పన్నిన వలలో ఎస్ఐ రమేష్ చిక్కారు. లంచంగా తీసుకున్న ₹20,000 నగదును ఎస్ఐ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజాసేవకుడిగా ఉండి కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని ఏసీబీ తెలిపింది. ఈ ఘటనలో నిందితుడైన ఎస్ఐ రమేష్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్లోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినట్లయితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
అలాగే వాట్సాప్ నంబర్ 9440464106, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.


