వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి
సిద్దిపేట, నవంబర్ 3 (ప్రజాస్వరం) :
జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి లో లెవెల్ వంతెనలు, కల్వర్టులు, రోడ్ల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అదేవిధంగా అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీలో వివిధ నిర్మాణాల మరమ్మత్తుల కొరకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ధాన్యం కోసిన వెంటనే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిర్ణీత తేమశాతం వచ్చేవరకు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుతున్నారని కానీ అకాల వర్షాలు సంభవించినప్పుడు ఆ ధాన్యం తడిసిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ధాన్యం కోసం వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రాకుండా నిర్ణీత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయ మరియు ఇతర అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు


