పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన..
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు..
సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు..
చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ):
చేగుంట మండలం పులిమామిడి-గజ్వేల్ ప్రధాన రహదారిపై నిజాంపేట్ మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమయానికి నీరు అందక వరి, మక్క, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదలాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామని రైతులు తెలిపారు. వెంటనే నీరు విడుదల చేయకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోఖో కారణంగా రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది, సమాచారం తెలుసుకున్న చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే నీటిని విడుదల చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.


