బీరంగూడ గుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘన విజయం...
హుండీ ఆదాయం రూ.8.62 లక్షలు – మొత్తం ఆదాయం రూ.80.92 లక్షలు
అమీన్ పూర్, ఫిబ్రవరి 20(ప్రజాస్వరం ):
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల అపార విశ్వాసంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా హుండీ ద్వారా రూ.8,62,677 ఆదాయం లభించింది.
అదేవిధంగా దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదాన విరాళాలు కలిపి మొత్తం రూ.80,92,132 సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. స్వామి అమ్మవార్లపై భక్తుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనమని తెలిపారు.
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు.
ఈ మహోత్సవాల విజయానికి సహకరించిన పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, ఎమ్మార్వో కార్యాలయం, దాతలు, వాలంటీర్లు, మీడియా ప్రతినిధులు మరియు భక్తులందరికీ దేవస్థానం కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


