జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదు....
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్...
మెదక్ , మార్చి 27 (ప్రజాస్వరం)
మెదక్ పట్టణంలో పలు హోటళ్లు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేసి 83 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో కూడా ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారి కి యధావిధిగా డెలివరీ జరుగుతుందని తెలిపారు. కొరత వుందనే వచ్చే వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కలెక్టర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని తెలిపారు. రోజుకు సగటున 3000 సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు. అదనంగా జిల్లా లోనీ గ్యాస్ గోదాముల్లో సుమారు 3500 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 6500 సిలిండర్లు ట్రాన్సిట్ లో ఉన్నాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 90 కిలోలీటర్ల పెట్రోల్ మరియు 110 కిలోలీటర్ల డీజిల్ అవసరం ఉండగా, ప్రస్తుతం మెదక్ జిల్లాలో 550 కిలోలీటర్ల పెట్రోల్, 644 కిలోలీటర్ల డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరఫరా యంత్రాంగం నిరంతరంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే ఏర్పడుతున్నాయని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు సివిల్ సప్లైస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ, పోలీస్ శాఖల సంయుక్త బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి వరకు మెదక్ జిల్లాలో పలు హోటల్లు రెస్టారెంట్ల యజమానులు గృహ అవసరాల కోసం (ఇళ్లలో) వాడే 14.2 కేజీల సిలిండర్లను, హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపార సంస్థలలో వాడటాన్ని గుర్తించి జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పౌర సరఫరాల శాఖ, పోలీస్, రెవిన్యూ ఆధ్వర్యంలో బృందాలు మెదక్ పట్టణంలో పలు హోటళ్లు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేసి 83మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.మెదక్ జిల్లాలో ప్రజలు గమ నించాల్సిన విషయం ఏమిటంటే వాహనా ల్లో ఇంధనం తక్కువగా ఉంటే తప్ప బంకు లకు వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చే ధృవీకరించని వార్తలను ఇతరులకు పంపవద్దన్నారు. ప్రభుత్వం లేదా చమురు కంపెనీల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి అన్నారు.వదంతులను నమ్మకుండా సంయమనం పాటిస్తే, ఈ క్యూ లైన్లు మాయమవుతాయి. మన భయం వ్యాపారులకు లాభం కావచ్చు, కానీ సామాన్యుడికి మాత్రం సమ యం, డబ్బు వృధానే, కాబట్టి గ్యాస్ ఇంధనం కొరత లేదు కాబట్టి ప్రజలందరూ సమన్వయం పాటించాలని తెలిపారు.


