ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీవో లు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త ..
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు...
సైబర్ మోసాలు గురైతే హెల్ప్ లైన్ 1930 డయల్....
నమ్మదగని ఆఫర్లు, ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దు...
మెదక్ నవంబర్ 23 (ప్రజా స్వరం)
ప్రజలు ఎక్కువగా మోసపోతున్న మూడు ప్రధాన రకాల సైబర్ నేరాలపై జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ రోజు రోజుకీ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువగా మోస పోతున్న మూడు ప్రధాన రకాల సైబర్ నేరాలపై జాగ్రత్తలు సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజల డబ్బును దోచుకునే నకిలీ ట్రేడింగ్ యాప్లు, వెబ్సైట్లు విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ ఐపీవో లను చూపించి పెట్టుబడులు దోచుకునే మోసపూరిత పద్ధతులు పెరుగుతున్నాయని చెప్పారు. ఆన్లైన్లో పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట మొదట చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా అడిగి, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి తరువాత భారీ మొత్తాలు వసూలు చేసే మోసాలు విస్తరిస్తున్నాయని వివరించారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గుర్తు తెలియని లింకులు లేదా యాప్ల ను డౌన్లోడ్ చేయవద్దునీ, బ్యాంక్ ఓటీపీ లు, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వవద్దనీ అన్నారు. నమ్మదగని ఆఫర్లు, ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దనీ, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అన్నారు.


