సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...
ఎమ్మెల్యే జిఎంఆర్...
అమీన్ పూర్, ఫిబ్రవరి 05(ప్రజాస్వరం ):
రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న మహా జాతర ఏర్పాట్లపై పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బీరంగూడ డివిజన్ పరిధిలోని ఆలయ ప్రాంగణంలో గురువారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు.
సామాన్య భక్తులే విఐపిలు అనే భావనతో దర్శన ఏర్పాట్లు చేయాలని, విఐపీ పేరుతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని, మూడు రోజులపాటు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నిరంతర నిఘా కోసం 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
బీరంగూడ గుట్టపై ఉన్న అక్రమణలను 24 గంటల్లోగా తొలగించాలని ఎమ్మార్వో వెంకటేష్ను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జాతర ఏర్పాట్లపై ఈనెల 12వ తేదీన మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అప్పటి లోపు అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తహసిల్దార్ వెంకటేష్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిఐ నరేష్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


