విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం.....
తూప్రాన్ ,సెప్టెంబర్ 08 (ప్రజాస్వరం) :
మేడ్చల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...
అందరితో కలిసిమెలిసి.. సరదాగా ఉండే ఆనందం ఇక లేరని తెలిసి కన్నీటిపర్యంతమైన సహచరులు...
బుధవారం మల్కాపూర్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు...
విధి నిర్వహణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మెదక్ జిల్లా ఏఆర్ హెడ్క్వార్టర్స్లోని క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న ఆనందం మంగళవారం తూప్రాన్ లో పోలీస్ చెక్పోస్ట్లో విధుల నిమిత్తం తూప్రాన్కు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే ఛాతినొప్పి రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.ఆస్పత్రిలో వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఆనందం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆనందం మృతి చెందినట్లు ధ్రువీకరించారు.ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉండటంతో పాటు సహచరులకు అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆనందం ఇక లేరనే వార్త తెలియడంతో సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆనందం అంత్యక్రియలను బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది హాజరై ఆనందానికి తుది వీడ్కోలు పలకనున్నారు.


