షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
సీఐ నరేష్...
అమీన్ పూర్ లో అప్రమత్తత
అమీన్ పూర్, ఫిబ్రవరి 06(ప్రజాస్వరం):
అమీన్ పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ సర్కిల్ వద్ద స్థానిక వ్యాపారులతో అమీన్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రాంతంలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతి దుకాణం లోపల, వెలుపల హై-క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సూచించారు. కెమెరాలు కేవలం ఏర్పాటు చేయడమే కాకుండా, 24 గంటల పాటు నిరంతర రికార్డింగ్ అయ్యేలా చూసుకోవాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డు వైపు ఉండే కెమెరాల పనితీరు సమర్థంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సీసీ ఫుటేజీలు నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో కీలక ఆధారాలుగా మారుతాయని తెలిపారు. కిష్టారెడ్డిపేట్ సర్కిల్ పరిసరాల్లోని వ్యాపారులు అందరూ సమన్వయంతో ఉండి తమ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుకోవడం సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ్, కిష్టారెడ్డిపేట్ సర్కిల్ వ్యాపార సంఘం ప్రతినిధులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.


