చిట్టోజిపల్లిలో వన్యప్రాణుల సమగ్ర లెక్కింపు....
డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్
చేగుంట, జనవరి. 25( ప్రజాస్వరం):
అఖిల భారత పులుల అంచనా జనగణన లో చివరి రోజు భాగంగా ఆదివారం మండలంలోని ఇబ్రహీంపూర్ బిట్ చిట్టోజిపల్లి అటవీ ప్రాంతంలో విస్తృతంగా నిర్వహించారు. ఈ జనగణన కార్యక్రమాన్ని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ గణనలో పులులతో పాటు జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, అలాగే నెమళ్లు, అడవి కోళ్లు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు వంటి పక్షి జాతులు, సర్పాలు, పాములు, ఉభయచరాలు సహా అన్ని రకాల వన్యప్రాణుల ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేశారు.వన్యప్రాణుల లెక్కింపులో పాదముద్రలు, మల విసర్జన, గోరు గుర్తులు, ఆహార అవశేషాలు, చెట్లపై గీతలు, నీటి వనరుల వద్ద కనిపించిన ఆనవాళ్ల ఆధారంగా అంచనా గణన చేపట్టారు. అటవీ ప్రాంతంలోని నీటి వనరులు, పచ్చిక మైదానాలు, చెట్ల సాంద్రత, జీవ వైవిధ్య పరిస్థితులను కూడా సమగ్రంగా పరిశీలించారు.
గ్రామాలకు సమీపంగా వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి పంటలకు నష్టం జరిగే అవకాశాలు మానవ వన్యప్రాణి ఘర్షణలు నివారించేందుకు అవసరమైన సూచనలను నివేదికలో చేర్చారు. ఈ గణన ద్వారా అడవుల్లో జీవ వైవిధ్యం స్థితిగతులపై స్పష్టమైన అవగాహన లభించిందని అటవీ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్ మాట్లాడుతూ 2026 గణనలో సేకరించిన సమాచారం వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి, జీవ వైవిధ్య పరిరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రీయంగా రూపొందించిన ఈ గణన భవిష్యత్తు ప్రణాళికలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రణయ్ కుమార్, వాలంటీర్లు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు


