రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
సర్పంచ్ వినోద్ కుమార్ ....
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22
సర్పంచ్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తొలి ప్రాధాన్యతగా వల్లూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ గుప్తా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే, రహదారి అధికారులు, సంబంధిత అధికారుల దృష్టికి మరల్చేలా ఏకధాటిగా కలుస్తూ సమస్య శాశ్వత పరిష్కారం కోసం వేడుకుంటున్నారు. ఈ మేరకు వినోద్ గ్రామ ఉపసర్పంచ్ మియాపురం రేఖతో పాటు కామారెడ్డి జాతీయ రహదారి 44 ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లు విలేఖరులకు తెలిపారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ గ్రామ ప్రజలు రహదారి దాటే సమయంలో తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, వృద్ధులు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజల్లో భయాందోళన నెలకొందని పేర్కొన్నారు. కేవలం సర్వీస్ రోడ్ వల్ల సమస్యలు పరిష్కారం కావని, గ్రామ ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అండర్పాస్ నిర్మాణం అత్యవసరమని స్పష్టం చేశారు. వినతి పత్రంపై ప్రాజెక్ట్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఇటీవల మండల పర్యటన కోసం వచ్చిన మెదక్ ఎంపీ రఘునందన రావు కు కూడా ఈ విషయాన్ని తెలుపుతూ వినతి పత్రం ఇచ్చామని, సంబంధిత అధికారులను తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ గుప్తా తెలిపారు.


