పటాన్ చెరు –అమీన్ పూర్ లో 9 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
పటాన్ చెరు, జనవరి 23(ప్రజాస్వరం):
పటాన్ చెరు, అమీన్ పూర్ జిహెచ్ఎంసి సర్కిళ్ల పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమీన్ పూర్ సర్కిల్, పటాన్ చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు అందించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన బొల్లారం, అమీన్ పూర్, తెల్లాపూర్, ముత్తంగి, జేపీ కాలనీ, బీరంగూడ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.
సిసి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిన ఎమ్మెల్యే, మంజూరైన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 27న భారతి నగర్, రామచంద్రపురం, 28న పటాన్ చెరు డివిజన్ పరిధిలో 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అదనపు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
ఈ సమావేశంలో పటాన్ చెరు డిప్యూటీ కమిషనర్ సురేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, ఏఈలు సునీల్, శివ, దివ్యతేజ, లావణ్య, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.


