దేశమాత ఆరాధన, సాధన కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ
వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం
న్యూఢిల్లీ , నవంబర్ 7 (ప్రజాస్వరం) :
వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలిపారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పిఎం మోడీ ప్రసంగించారు. ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని, వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం, సంకల్పం భారత్ అని మోడీ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని, పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ప్రశంసించారు. భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, బంకించంద్ర ఆనంద మఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు. ఆనంద మఠ్ ఉపన్యాసం..భారత్ స్వప్నం అని ఠాగూర్ చెప్పారని, ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదని, బానిసత్వపు రోజుల్లోనూ వందేమాతరం గీతం అమరత్వం పొందిందని హర్షం వ్యక్తం చేశారు. వందేమాతరం గీతాలాపన కోట్లమంది భారతీయుల్లో కొత్త శక్తిని రేకెత్తిస్తోందని, సాధించలేని సంకల్పం లేదని, మన భారతీయులు సాధించలేని లక్ష్యం లేదని మోడీ స్పష్టం చేశారు.


