జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
మెదక్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):
మెదక్ జిల్లా కేంద్రంలోని సరస్వతి కాన్వెంట్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు రూపొందించిన గణిత ప్రాజెక్ట్ జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనకు ఎంపికైంది. రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఈ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. “నేర దర్యాప్తులో సహాయం” అనే అంశంపై రూపొందించిన ఈ ప్రాజెక్టులో గణితంలోని త్రికోణమితి (Trigonometry) సిద్ధాంతాలను ఉపయోగించి విమాన ప్రమాదాలను ఎలా తగ్గించవచ్చో ఒక నమూనా (మోడల్) ద్వారా వివరించారు. ఈ ప్రాజెక్టును పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆఫీఫా అమీనా, సాత్విక గౌడ్ రూపొందించగా, గణిత ఉపాధ్యాయులు కె. దత్తు కుమార్ మార్గదర్శకత్వం వహించారు. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి మొత్తం 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, అందులో అత్యధికంగా మెదక్ జిల్లా నుండి నాలుగు ప్రాజెక్టులు ఎంపిక కావడం విశేషమని అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుమిత్ర, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవిద్య, ఉపాధ్యాయ బృందం గైడ్ టీచర్ దత్తు కుమార్ ను, విద్యార్థులను అభినందించారు.


