యేసుక్రీస్తు మరణం పై విజయం రోజే ఈస్టర్ పండగ....
కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నం...
మోడరేటర్, మెదక్ ఇంచార్జీ బిషప్ రూబెన్ మార్క్....
ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు...
మెదక్ ,ఏప్రిల్ 05 (ప్రజాస్వరం):
మానవాళికి కరుణ పంచిన ఏసు క్రీస్తు అందరినీ కాపాడతారని, ఆయన మరణించి తిరిగి లేచిన శుభదినం ఈస్టర్ అని మోడరేటర్, మెదక్ ఇన్చార్జి బిషప్ రూబెన్ మార్క్ అన్నారు. ఆదివారం వందేళ్ల చరిత్ర గల మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువుల ప్రత్యేక ఆరాధనలు, తెల్ల వారుజాము 4.30 గంటలకు సూర్యోదయ ఆరాధనలతో వేడుకలు ఆరంభమయ్యాయి. అంతకు ముందు శిలువను చర్చి ప్రాంగణంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బిషప్ రూబెన్ మార్క్ మాట్లాడుతూ యేసు క్రీస్తు మరణించి తిరిగి మూడవ దినమున లేచిన దినాన్ని ఈస్టర్ గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. శిలువ పై ప్రాణాలు విడిచిన ఏసు, ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారాని, మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టరు పండుగగా జరుపుకుంటారని అన్నారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈస్టర్ రోజుకు ముగుస్తుందని అన్నారు. మరణం అనేది జీవితానికి అంతం కాదని, ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారని అన్నారు. ఈస్టర్ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంచార్జ్ శాంతయ్య, గురువులు డేవిడ్ రిచర్డ్, జైపాల్, శ్రీనివాస్, సంజీవ్ రావు, సోలమన్ రాజ్, చర్చి కమిటీ కోశాధికారి, కౌన్సిలర్ గంట సంపత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


