జొన్నల కొనుగోలు చేయాలని రైతులతో కలసి ధర్నా....
మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి....
రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే....
ప్రజాస్వరం , మెదక్ ,జూన్ 30 :
జొన్నలు పండించిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ను వీడబోమని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం పద్మ దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతేపల్లి, కాట్రియల, పర్వతాపూర్, కిషన్ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రైతులతో కలసి ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జొన్నలను కొనుగోలు చేసిన అనంతరం మట్టి పేల్లలు ఉన్నాయనే కారణంతో మార్క్ఫెడ్ అధికారులు తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను నాణ్యత పేరుతో, మట్టి పేల్లలు ఉన్నాయనే సాకుతో తిరిగి రైతులకే అప్పగించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేసినట్లు తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులు జొన్నలను తిరిగి పంపిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జొన్నల కొనుగోలుపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తూ రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జొన్న పంట సాగు చేసిన రైతులు మార్కెట్లో సరైన ధర లేక, ప్రభుత్వ కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మట్టి పేల్లలు ఉన్నాయనే కారణంతో జొన్నలను తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గతంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే విధంగా జొన్నలను కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జొన్నల కొనుగోలులో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మార్క్ఫెడ్ డిఎం, బాలకృష్ణ డిఆర్ఓ అంబదాస్ జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరేళ్ళ.మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్.కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చౌదరి. సుప్రభాత రావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరిత, బిఆర్ఎస్, నాయకులు ఎస్కే అహ్మద్. ఉమామహేశ్వర్, శ్యామ్, స్మోకింగ్, నవీన్, దోమకొండ శ్రీను, అస్నుద్దిన్, విజయ భాస్కర్ రెడ్డి, సత్యపాల్, కిషన్ బాబు, సంతోష్, శ్రవణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్, నర్సింగరావు, మెదక్ పట్టణ నాయకులు లింగారెడ్డి ప్రభు రెడ్డి, మోచి. కిషన్, ఇందాద్, సాయి, కిరణ్, ఎంబీపూర్ మహేష్, స్వామి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.


