గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స....
మహిళ భుజం నుండి 750 గ్రాముల ట్యూమర్ తొలగింపు..
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ...
గజ్వేల్, 16 మార్చి (ప్రజాస్వరం) :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక స్థోమత లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించలేని నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలిచారు. గజ్వేల్ పట్టణానికి చెందిన జ్యోతి (32) భర్త హనుమంతు అనే మహిళ గత కొంతకాలంగా కుడి భుజంపై పెద్ద కణితి (ట్యూమర్) సమస్యతో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆమె, ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత లేక గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించారు. రోగి పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఒక బృందంగా ఏర్పడిన వైద్యులు సుమారు 750 గ్రాముల బరువున్న భారీ ట్యూమర్ను (నియోప్లాజమ్) విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, "పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం. శరీరంలోని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల డీఎన్ఏ మార్పులు, రేడియేషన్ లేదా జన్యుపరమైన కారణాలతో ఇటువంటి ట్యూమర్లు ఏర్పడతాయి. శరీరంలో ఎక్కడైనా అసాధారణ గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవాలి" అని సూచించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన జనరల్ సర్జన్ డా. ప్రేమ్ కిషోర్, అనస్థీషియా నిపుణులు డా. మహిపాల్, డా. ఇస్రత్, ఓటీ టెక్నీషియన్లు సునీల్, రాజ్కుమార్, స్టాఫ్ నర్సులు రాజు, పవని, ఆస్మాను సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. తమకు మెరుగైన వైద్యం అందించిన వైద్య బృందానికి రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.


