తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
హైదరాబాద్, (ప్రజాస్వరం ) :
తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో మూడు రోజుల క్రితం ఓ మృత దేహాన్ని స్థానికులు గుర్తించి విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకొని మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి ఒంటి పై ఉన్న గాయాలతోపాటు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా అది హత్యగా అనుమానించారు. మృతుడు కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రాథమికంగా ఏం జరిగిందని కుమార్తె మనిషా, ఆయన భార్య శారదలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు వివరింస్తూ నిత్యం తాగుతూ వేధిస్తున్నాడని ప్రతి ఒక్కరితో గొడవలు పడుతున్నట్టు కూడా తెలిపారు. లింగం కుటుంబ సభ్యుల తడబాటు, వారి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ దిశగానే కేసును దర్యాప్తు చేపట్టారు. చెరువు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించడంతో స్పాట్లో కుమార్తె మనీషా ఉన్నట్టు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం కుట్రను చెప్పేసింది. వివాహేతర బంధానికి అడ్డుతగులుతున్నాడని ప్రియుడు, తల్లితో కలిసి తండ్రిని హత్య చేసినట్టు మనీషా చెప్పింది. పాతబస్తీలోని ఓ అపార్ట్మెంట్లో లింగం సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్దకుమార్తె మనీషాకు వివాహం చేసి పంపించారు. కానీ ఆమె భర్త స్నేహితుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త వదిలి వెళ్లిపోయాడు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో మనీషా ప్రియుడితో కలిసి మౌలాలీలో నివాసం ఉంటుంది. ఇలా బహిరంగంగా తిరగడంపై తండ్రి చాలా సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పద్ధతిగా ఉండాలంటూ చెప్పాడు. తండ్రి పదే పదే తన వివాహేతర సంబంధంపై మాట్లాడటం మనీషాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని తల్లి శారద వద్ద చెప్పింది. అయితే తనకి కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయని లింగం అనుమానిస్తున్నట్టు తల్లి చెప్పింది. తమ దారికి అడ్డు వస్తున్న లింగంను హత్య చేస్తే అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని అనుకున్నారు. మనీషా ప్లాన్కు తల్లి శారద కూడా ఓకే చెప్పంది. అంతే ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసేందుకు స్కెచ్ వేసింది మనీషా. ఐదో తేదీన మనీషా నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కల్లులో కలిపి భర్తకు భార్య శారద ఇచ్చింది . అంతే లింగం గాఢ నిద్రలోకి జారుకున్నాడు . నిద్రలో ఉన్న లింగం మనీషా, జావీద్, శారదలు కలిసి హత్య చేశారు. ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆపేశారు. హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి సెకండ్షో సినిమాకు వెళ్లారు. అనంతరం క్యాబ్లో వచ్చి డెడ్బాడీని మాయం చేశారు. ఇంట్లో ఉన్న డెడ్బాడీని ఎక్కిస్తున్న టైంలో క్యాబ్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. ఏం అయిందని అడిగితే ఫుల్గా తాగేసి మత్తులో ఉన్నాడని కవర్ చేశారు. ఆ డెడ్బాడీని తీసుకొని ఎదులాబాద్ వద్ద దిగిపోయారు. క్యాబ్ డ్రైవర్ వెళ్లి పోయిన తర్వాత డెడ్బాడీని ముగ్గురు కలిసి స్థానికంగా ఉన్న చెరువులో పడేశారు.చెరువులో డెడ్బాడి కుళ్లిపోయే స్థితికి చేరుకుంటుందని తర్వాత ఎవరూ గుర్తు పట్టలేరని అనుకున్నారు. కానీ రెండు రోజుల తర్వాతే డెడ్బాడీ పైకి తేలుతూ కనిపించింది. దీంతో అసలు గుట్టు రట్టు అయింది. ఈ కేసులో పోలీస్ లు మనీషా, శారద, జావీద్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించారు.