చిన్నారి మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
గజ్వేల్, ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం):
నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి ఘటన దురదృష్టకరం అని, చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజకులు ములుగు రాజీవ్ రహదారిపై నిరసన చేపట్టారు.నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చిన్నారి గాయపడి, మృతి చెందిన ఘటనకు నిరసనగా సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై రజక సంఘం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్,బీసీ కుల సంఘాలతో కలిసి ధర్నా, ర్యాలీ నిర్వహించారు. నేటికి కులాల పేరిట చిన్నారిని దూషించి తన్నడం బాధాకరమని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఘటనను చూస్తే మనం ఏ కాలంలో ఉన్నామోననే భయాందోళన ఉందన్నారు. అంతేకాక చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కారకులపై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు భూమన్న కనకరాజు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మహేష్,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రాజు, సహాయ కార్యదర్శి భాస్కర్, నవీన్, నాగరాజు, ఆంజనేయులు,రవి,వెంకటేష్,ప్రవీణ్,బాబురావు,నవీన్,ఆంజనేయులు,గోపాల్,మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.


