కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు
అధికార పార్టీ దళిత యువ నాయకుడి హత్య
తుపాకీ తో కాల్చి చంపిన దుండగులు....
హత్య కు భూమి, డబ్బుల వివాదాలే కారణమా..?
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
కొనసాగుతున్న విచారణ
మెదక్ జూలై 15 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లా లో కాల్పుల తో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన దళిత యువ నాయకుడిని తుపాకీ తో కాల్చి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ముందుగా రోడ్డు ప్రమాదం గా భావించారు. కానీ ఈ హత్య ఘటనకు రాయలసీమ చెందిన నేత హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన మారెల్లి అనిల్ సోమవారం రాత్రి వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన వెళ్ళిన కారులో గాయాలై ఉన్నాడు. స్థానికులు గమనించి రక్తపు మడుగులో గాయాలైన అనిల్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంగానే అంతా భావించారు. కానీ అనిల్ శరీరం లో బుల్లెట్ గాయాలు ఉండడం తో హత్యగా గుర్తించి ఘటన స్థలం లో పరిశీలించగా నాలుగు బుల్లెట్స్ లభ్యమైనట్లు తెలిసింది. గన్ తో హత్య చేసిన వైనం పై జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు వెంటనే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ కు ఆదేశించారు.
హైదరాబాద్ మీటింగ్ వెళ్లి రాగానే….
గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన నర్సాపూర్ నియోజక వర్గ నేతల సమావేశానికి అనిల్ కారులో స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం వెళ్ళారు. అక్కడ మీటింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో హంతకులు వెంటే వచ్చినట్లు తెలుస్తుంది. కారులో ఉన్న అందరు దిగి వెళ్ళిన తర్వాత హత్య చేసినట్లు తెలుస్తుంది. వెళ్తున్న కారుకు రెండు వైపుల కార్లు పెట్టీ డోర్ వద్దకు వెళ్ళి దగ్గర నుంచి షూట్ చేసినట్లు బావిస్తున్నారు. గన్ తో షూట్ చేసిన బుల్లెట్స్ శరీరంలోనే ఉన్నట్లు సమాచారం.ఫోరెన్సిక్ అధికారులు వచ్చి బులెట్ తీసిన తరవాతే గన్ ఎక్కడిది, ఎంత రేంజ్ నుంచి కాల్చారు అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనీల్ హత్య కుట్రలో రాజలసీమ నేత తో పాటు ఇటీవల కాలంలో జరిగిన భూ వివాదాలు, ఇతర పంచాయతీల్లో పాల్గొన్న వాటి వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సుఫారీ ఇచ్చి హత్య చేయించారా.. బాధితులే నేరుగా వచ్చి హత్య చేశారా అనే కోనంలో కూడా విచారణ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆసుపత్రిలో ఉన్న అనిల్ మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీస్ అధికారులతో మాట్లాడి హంతకులను త్వరగా పట్టుకోవాలని కోరారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ.………
మొదట రోడ్డు ప్రమాదం అని భావించామని, కానీ ఆసుపత్రి లో వైద్యులు బుల్లెట్ గాయాలు అయ్యాయని తేల్చడంతో సంఘటన స్థలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని అన్నారు. సంఘటన స్థలంలో బుల్లెట్ లు స్వాధీనం చేసుకున్నామని, మరిన్ని వివరాలు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా విచారణ ముమ్మరం చేస్తామని అన్నారు. ఇప్పటికే హత్య కేసు లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.