రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి...
మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్...
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు...
మెదక్ ,ఏప్రిల్ 05 (ప్రజాస్వరం):
మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటల లోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదివారం ఒక ప్రకటనలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.


