సీఎం కప్ క్రీడలు ప్రారంభం......
తొగుట సీఐ లతీఫ్
దౌల్తాబాద్, జనవరి 30 (ప్రజాస్వరం):
క్రీడల ద్వారా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, గెలిచినవారు ఆనందించాలనీ, ఓడినవారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
అన్ని గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ కుమ్మరి రాజు, ఎంపీఓ వడ్ల శివకుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేకుల నరసింహారెడ్డి, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు స్వామి, ఉపాధ్యాయులు నాగరాజు, పీఈటీ గోవర్ధన్ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


