నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):
నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది.
అమీన్పూర్ మున్సిపాలిటీలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేయడం తీవ్ర అన్యాయం అని నాయకులు మండిపడ్డారు. జిహెచ్ఎంసి పరిధిలో 20 వేల ఓట్లతోనే డివిజన్లు ఉన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ, అమీన్పూర్పై వివక్ష ఎందుకు అంటూ ప్రశ్నించారు. అమీన్పూర్ మండలంలోని ఎనిమిది గ్రామపంచాయితీలను కలుపుకొని కిష్టారెడ్డిపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటే ప్రజాభిలాష అని స్పష్టం చేశారు.
ఈ నిరాహార దీక్షకు అమీన్పూర్ జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ బృందంతో హాజరై మద్దతు తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు.
దీక్షకు ఏఐపిసి జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, జయవర్ధన్, రాజశేఖర్, నరేష్, సాయి గౌడ్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు.


