అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం): జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్ర వారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి పరిగి , వికారాబాద్ మున్సిపల్ పరిది లో పొంగిపొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... భారీ వర్షాల మూలంగా జిల్లాను రెడ్ అలర్ట్ గా గుర్తించడం జరిగిందని, ప్రజలు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అనుకుంటేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ప్రజలకు సూచించారు. పెద్ద పెద్ద భవనాల దగ్గర, చెట్ల దగ్గర పిడుగులు పడే ప్రమాదం ఉంటుందని ప్రజలు అట్టి ప్రాంతాల్లో ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. పశువులను కాపాడుకునే దిశగా గ్రాసం నిమిత్తం బయటకు తీసుకు వెళ్ళవద్దని కలెక్టర్ సూచించారు. పెద్ద మొత్తంలో వాగులు, వంతెన వద్ద నీరు ఉప్పొంగితే అధికారులకు సమాచారం ఇస్తే తగు జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ లు జాకీర్ అహమ్మద్, పోలీస్ అధికారులు ఉన్నారు.


