కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు
మేడ్చల్ / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు.శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని, వేద పండితులు మరియు విద్యార్థులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కారం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి టిటిడి ఛైర్మెన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.వేద పండితులు, విద్యార్థులు మరియు సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ, ఈ పాఠశాల 1981 సంవత్సరంలో స్థాపించబడిందని, ప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టిటిడి ఛైర్మెన్కు తెలిపారు.


