మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలు
హైదరాబాద్ మార్చ్ 13 ( ప్రజాస్వరం ) :
మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించవచ్చని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని చేపల చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో అందిస్తే అటు మత్యకారులకు ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుందని మత్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సిఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్నా భోజన పథకంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. అయితే, విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెడితే మరింత పోషకాహారం లభిస్తుందని ఈ నేపథ్యంలోనే వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని సిఎం రేవంత్రెడ్డి కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది.


