పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
పొలాల్లోకి పరుగులెత్తిన ఎస్ఐ......
మెదక్ నవంబర్ 18 (ప్రజా స్వరం)
ఏసీబీ ట్రాప్ ను గమనించిన ఎస్ఐ పోలీసు స్టేషన్ వెనుక వైపు గోడ దూకి, పొలాల మీదుగా పరుగులు తీశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్టేషన్ వద్ద జరిగింది. ఎస్ఐ ను పట్టుకునేందుకు అక్కడే మాటు వేసిన సుమారు 15 మంది ఏసీబీ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఏసీబీ కి ఎస్ఐ రాజేశ్ చిక్కినట్లు తెలియడంతో స్థానికులు టపాసులు పేల్చి కేరింతలు కొట్టారు. టెక్మాల్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు అద్దెకు తీసుకొచ్చిన హార్వెస్టర్ బ్యాటరీ చోరీ సంఘటన పై ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పరిష్కరించడానికి అసద్ మహమ్మద్ పల్లి కి చెందిన రైతు పాండును స్థానిక ఎస్ఐ రాజేష్ 50 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం మొదటి దఫా గా 30వేలు బాధితుడు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు టెక్మాల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు 20 వేలు ఎస్ఐ కు ఇచ్చి వెళ్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ ట్రాప్ పై అనుమానం వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాదాపు 15 మందితో కూడిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం పొలాల్లో పరిగెత్తుతున్న ఎస్ఐ ను వెంబడించి పట్టుకున్నారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో అధికారుల కొనసాగుతున్నాయి. కాగా ఓ వైపు ఏసీబీ అధికారులు ఎస్ఐ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారిస్తుండగా మరోవైపు స్థానికులు టపాసులు పేల్చడం గమనార్హం....


