పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు
ఆపరేషన్ సింధూర్
= పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు
= మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం
= తొమ్మిది స్థావరాలపై దాడులు.. కచ్చితమైన టార్గెట్ చేసినట్లు ఇండియాన్ ఆర్మీ వెల్లడి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. పూర్తి కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేసింది
పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్లో పోస్టు చేసింది. మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేపట్టడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉగ్రస్థావరాపై భారత్ దాడుల నేపథ్యంలో ప్రతికార దాడులు ఉంటాయని పాక్ ప్రకటించింది.


